గడ్డాఫీ చేజారుతున్న లిబియా, లిబియానుండి వెళ్ళిపోతున్న విదేశీయులు
65 లక్షల జనాభా గల ఎడారి దేశం లిబియా క్రమంగా గడ్డాఫీ చేజారుతోంది. విదేశాల్లో లిబియా తరపున నియమించబడిన రాయబారులు ఒక్కొక్కరు గడ్డాఫీకి ఎదురు తిరుగుతున్నారు. సైనికులు గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆందోళనకారుల్లో చేరిపోతున్నారు. వ్యతిరేకులుగా మారిన సైనిక బ్యారక్ లపై ప్రభుత్వ దళాలు విమానాలనుండి బాంబు దాడులు చేస్తున్నారు. హింసాత్మకంగా మారుతున్న లిబియానుండి విదేశీయులు తమ తమ స్వస్ధలాలకు వెళ్ళిపోతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విమానాల ద్వారా, ఓడల ద్వారా తమ దేశీయులను వెనక్కి రప్పించుకుంటున్నాయి. గడ్డాఫీ తాను ఎక్కడికి పారిపోలేదనీ లిబియాలోనే ఉన్నానని టీవిలో కనపడి మరీ ప్రకటించాడు.
రాజధాని ట్రిపోలిలోని గ్రీన్ స్క్వేర్ వద్ద ఆందోళనకారులపై నేరుగా కాల్పులు జరిపి డజన్ల మందిని చంపివేయటాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ముఖ్యాధికారి “నవీ పిళ్ళై” తీవ్రంగా ఖండించారు. అటువంటి చర్యలు “మానవత్వంపై జరిపే నేరపూరిత దాడుల కిందికి వస్తాయ”ని ప్రకటించారు. శాంతియుత ప్రదర్శనకారులపై లిబియా అధికారులు, వారు అద్దెకు తెచ్చుకున్న సాయుధ దుండగులు కాల్పులు జరిపి చంపివేయటం చాలా తీవ్రమైందని” తన ప్రకటనలో పేర్కొన్నారు. మంగళ వారం ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి లిబియా పరిణామాలపై అంతర్గతంగా సమావేశం కానుంది. అరబ్ లీగ్ కూడా అత్యవసర సమావేశం జరపాలని నిర్ణయించుకుంది.
లిబియా తూర్పు ప్రాంతం మొత్తం ఆందోళనకారుల వశంలో ఉందని బిబిసి తెలియజేసింది. ఆ ప్రాంతంలోని సైనికులు కూడా గడ్డాఫీకి వ్యతిరేకంగా మారారు. దానితో వారి స్ధావరాలపై ప్రభుత్వ సైన్యం యుద్ధ విమానాల నుండి బాంబు దాడులు చేస్తున్నారు. పూర్తిగా ఆందోళనకారుల వశంలో ఉన్న బెంఘాజీ పట్టణ పౌరులపై బాంబుదాడులు జరుపుతున్నామన్న వార్వలను గడ్డాఫీ కుమారుడు సైఫ్ ఖండించాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన సైనికులపైనే బాంబు దాడులు చేస్తున్నాం తప్ప ప్రజలపై కాదని తెలిపాడు. ఈజిప్టుతో ఉన్న సరిహద్దు వద్ద ఉన్న లిబియా గార్డులను ఉపసంహరించుకోవటంతో ఈజిప్టు తన గార్డులను అక్కడికి పంపినట్లుగా ఈజిప్టు తెలిపింది.
లిబియాలో 10,000 మందికి పైగా ఈజిప్టు దేశీయులు సరిహద్దు దాటి తమ దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే వేలమంది వచ్చేశారనీ సరిహద్దు దాటి వస్తున్న తమ దేశస్ధుల సౌకర్యార్ధం అక్కడ తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామనీ ఈజిప్టు తెలిపింది. తమ పౌరుల కోసం రెండు విమానాలను పంపిస్తున్నామని కూడా ఈజిప్టు ప్రభుత్వం తెలిపింది. బెంఘాజీ పట్టణంలోని విమానాశ్రయం ధ్వంసం కావడంతో లిబియాలో 15 లక్షల వరకు ఉన్న తమ పౌరుల తరలింపు క్లిష్టంగా మారినట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి “అహ్మద్ అబౌల్ ఘీత్” తెలిపాడు. 300 మంది వరకు ఉన్న దక్షిణ కొరియా నిర్మాణ కార్మికులను ఆందోళనకారులు నిర్బంధించారు. వారిలో వందమంది బంగ్లాదేశ్ కు చెందినవారు. బంగ్లాదేశ్ దేశీయులు 50,000 మంది లిబియాలో కార్మికులుగా పని చేస్తున్నారని రాయిటర్స్ తెలిపింది.

No comments:
Post a Comment